
విజయనగరం పట్టణం రామనారాయణ పరిసరాల్లో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యాయత్నం చేస్తున్న యువకుడ్ని వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది జూన్ 1న కాపాడి, కౌన్సిలింగ్ చేసి, వారి తల్లిదండ్రులకు అప్పగించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్లగా.. సాలూరు పట్టణానికి చెందిన యువకుడు మనస్తాపం చెంది, ఇంటి నుండి బైకుపై బయలుదేరి, విజయనగరం చేరుకొని, తాను ఆత్మహత్య చేసుకుంటానని, తన కోసం వెదకవద్దని ఫోనులో సమాచారం కుటుంబ సభ్యులకు అందించారు. యువకుని కుటుంబ సభ్యులు విషయాన్ని విజయనగరం వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ కు ఫోనులో తెలుపగా, పోలీసులు తక్షణమే స్పందించి, ఫోను నంబరు ఆధారంగా యువకుడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. మరోవైపు యువకునితో ఫోనులో కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తూ, మరో వైపు లొకేషన్ ఆధారంగా యువకుడ్ని రామనారాయణ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద కూర్చొని, ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నిస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే, వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ మరియు సిబ్బంది పరుగున వెళ్లి, యువకుడ్ని రైల్వే ట్రాక్ నుండి బయటకు లాక్కొని, పోలీసు స్టేషన్ కు తీసుకొని వెళ్లి, కౌన్సిలింగ్ నిర్వహించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
కౌన్సిలింగ్ తరువాత యువకుడ్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారన్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించి, యువకుడ్ని కాపాడిన వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.